నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.
కొత్తపేట : కోనసీమ ముద్దుబిడ్డ, భారత లోక్ సభ మాజీ స్పీకర్ గంటి మోహన చంద్ర బాలయోగి సేవలు అజరామరమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం బాలయోగి వర్ధంతి సందర్భంగా ఆయన కొత్తపేట బస్టాండ్ సెంటర్ లో విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బండారు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన బాలయోగి పేరు ప్రఖ్యాతులు ఇక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని కొనియాడారు. కోనసీమలో ఏ మూలకు వెళ్ళినా ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన అడుగుజాడలు కనిపిస్తాయన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో జాతీయ రహదారి రావడానికి, జొన్నాడ వద్ద, సిద్ధాంతం వద్ద నూతనంగా రెండు వారధులు ఏర్పడడానికి ఆయనే కారణమన్నారు. యానాం - ఎదుర్లంక వారధి, బోడసకుర్రు వారధుల నిర్మాణానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. అందరితో సఖ్యంగా ఉంటూ మన బాలయోగి, మనవారు అని పేరు తెచ్చుకున్నారన్నారు. ఒక దశాబ్ద కాలం పాటు వివిధ పదవుల్లో ప్రజా ప్రతినిధిగా సేవలందించి లోక్సభ స్పీకర్ గా ఉన్నత శిఖరాలకు చేరారన్నారు. వారి మీద అభిమానంతో వారి కుమారుడు హరీష్ మాధూర్ పార్లమెంటు సభ్యునిగా ఉన్నారన్నారు. ప్రజల హృదయాల్లో చిరకాలం బాలయోగి నిలిచి ఉంటారని కొనియాడారు. ఆయన బాటలో నడిచి కోనసీమ అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మొదటి వ్యాఖ్య రాయండి!