ఇరాన్‌   : పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే ముడిచమురు ధరలు పెరుగుతుండగా.. ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ మరింత ఆందోళనకు దారితీస్తోంది. హోర్ముజ్‌ జలసంధిని మూసివేశామని, నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పు పెడతామని హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని ఇరాన్ హెచ్చరించింది. హోర్ముజ్‌.. ప్రపంచ ఇంధనానికి జీవనాడి వంటిది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదోవంతు రవాణా అవుతోంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయం అయినా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడిస్తుంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్‌ఎన్‌జీ అత్యధికంగా భారత్‌, చైనా, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇంతటి కీలకమైన జలసంధి మూసుకుపోతే.. రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. కాగా.. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో తమ సుప్రీంనేత ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే హోర్ముజ్‌ను మూసివేసినట్లు ప్రకటించింది. డేటా అండ్ అనలిటిక్స్ సంస్థ కెప్లర్ గణాంకాల ప్రకారం.. సుమారు 150 ఆయిల్‌ ట్యాంకర్లు ఇప్పటికే ఈ హోర్ముజ్‌ నుంచి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు హోర్ముజ్‌ తూర్పువైపున 60 ట్యాంకర్లు వేచిచూస్తున్నాయి. ఇదిలాఉంటే, ఫిబ్రవరి మధ్యలో సైనిక విన్యాసాల కోసం జలసంధిలో కొంతభాగాన్ని ఇరాన్ మూసివేయగా.. అప్పుడు చమురు ధరలు 6 శాతం మేర పెరిగాయి.