ఆనందపురం, మే 20: ఆనందపురం మండలం దబ్బంద గ్రామంలో నిర్మించిన టిడ్కో గృహాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం సందర్శించారు. కాలనీ ప్రజల సమస్యలను ఆయన అడిగి తీసుకున్నారు. టిడ్కో కాలనీలో 1,920 యూనిట్లు ఉండగా.. సరైన సౌకర్యాలు లేకపోవడంతో కేవలం 10- 15 శాతం మంది నివాసముంటున్నారని వారు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద సబ్సిడీ ధరకు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను కేటాయించారు. బ్యాంకులకు ఈ.ఎం.ఐ.లు కట్టలేక, కనీస వసతులు లేని దబ్బంద టిడ్కో ఇళ్లల్లో ఉండలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. బ్యాంకు నుంచి తీసుకున్న  రుణాలు రద్దు చేయాలని కోరారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పార్కు, ఆరోగ్య కేంద్రం, రేషన్ డిపో, ప్రజా రవాణా వంటి ప్రాథమిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి వేళ్లలో వీధి దీపాలు వెలగకపోవడం వల్ల మహిళలకు రక్షణ కరువవుతోందని, చెత్తా చెదారం పేరుకుపోవడంతో విష సర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయన్నారు. అలాగే స్మశాన వాటిక నిర్మించాలని విన్నవించారు. త్వరలో జరిగే జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సమావేశంలో టిడ్కో కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన గురించి చర్చించి, పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని గంటా హామీ ఇచ్చారు. అంతకుముందు కాలనీలో టీడీపీ జెండాను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనుబాబు, డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ, టిడ్కో ఎస్.ఈ. రామిరెడ్డి, ఈఈ సుధాకర్, డీఈ రాజేష్, ఏఈ అనూష, సి.ఎల్.టి.సి. దేముడు బాబు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, గండ్రెడ్డి సోమినాయుడు, లొడగల వెంకట్రావు, బలిరెడ్డి మల్లికార్జునరావు, మదపాటి శ్రీను, గండ్రెడ్డి రమేష్, కాళ్ల నగేష్ కుమార్, అప్పలరాము, ఎర్ర రాజు, బోని ప్రసాద్, శివ, శ్రీను, కుమార్ తదితరులు పాల్గొన్నారు.