విశాఖపట్నం : 
ప్రపంచ ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (IBD) దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు IBD పై ముందస్తు నిర్ధారణ, ప్రజల్లో అవగాహన మరియు సమయానుకూల వైద్యం అత్యంత కీలకమని తెలిపారు. ఈ ఏడాది థీమ్ “IBD Has No Borders – Access to IBD Care” ద్వారా ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తు చేస్తున్నట్లు చెప్పారు.డా. అనిరుద్  కొవ్వలి ,  కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, మాట్లాడుతూ అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్ వంటి IBD కేసులు ప్రస్తుతం యువతలో వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం, అధిక యాంటీబయోటిక్ వినియోగం వంటి కారణాలు ఈ వ్యాధుల పెరుగుదలకు దారితీస్తున్నాయని చెప్పారు.దీర్ఘకాలిక విరేచనాలు, కడుపు నొప్పి, మలంలో రక్తం, బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు. ఆలస్యమైన నిర్ధారణ వల్ల పేగు సమస్యలు, పోషకాహార లోపం, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు.అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న బయోలాజిక్ థెరపీలు, ఆధునిక చికిత్సలు మరియు జీవనశైలి మార్పులతో IBD ను సమర్థంగా నియంత్రించవచ్చని తెలిపారు. సమతుల ఆహారం, ఒత్తిడి నియంత్రణ, పరిశుభ్రత, క్రమం తప్పని వైద్య పరీక్షలు ఆరోగ్య పరిరక్షణకు కీలకమని నిపుణులు సూచించారు.